Stock Markets: ఇరాన్-అమెరికా దేశాల మధ్య మళ్లీ దాడులు తీవ్రతరం కావడంతో ప్రపంచ మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ముడి చమురు ధరలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల వంటి అనేక అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ(బుధవారం) ఉదయం మార్కెట్లు ఓపెన్ అవ్వగానే సూచీలు నష్టాలను చవిచూశాయి. దీంతో నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
పశ్చిమాసియాలో గత నెల రోజులుగా ఆగిన దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్పై అమెరికా భీకర దాడులు చేస్తుండడంతో చమురు ధరలు విపరీతంగా పెరిగి దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరోవైపు బంగారం ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర 0.6 శాతం మేర క్షీణించి ఔన్సుకు 4,304.01 డాలర్లకు, స్పాట్ వెండి 63 డాలర్లకు పడిపోయాయి.
ఇక దాడుల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగాయి. ప్రస్తుతం డబ్ల్యూటీఐ(WTI) క్రూడ్ బ్యారెల్ 91 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 96 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. చమురు ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరింత ఎక్కువవుతుందనే ఆందోళనలు పెరిగాయి. ఈ క్రమంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX)లో బంగారం అమ్మకాలు మందగించాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బంగారం ధరలు(Gold Rates) ఎలా ఉన్నాయంటే.. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కడపలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,52,020, 22 క్యారెట్ల ధర రూ.1,39,350 ఉండగా.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,52,020, 22 క్యారెట్ల ధర రూ.1,39,350గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.2,31,780కి చేరింది. అయితే ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ మళ్లీ మారే అవకాశం ఉంటుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు తాజా మార్కెట్ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

