Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామమందిర పరిపాలన, నిర్వహణ బాధ్యతలను ఇకపై భారత వైమానిక దళ మాజీ అధికారి పర్యవేక్షించనున్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామ్ మందిర్ మొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా(Jitendra Mishra)ను నియమించింది. ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో అందరి అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జితేంద్ర మిశ్రాను 3 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులో నియమించారు.
రామ మందిరం సీఈఓగా జితేంద్ర మిశ్రా ఆలయ పరిపాలన, రోజువారీ కార్యకలాపాలను పూర్తిగా పర్యవేక్షిస్తారు. మందిరానికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వసతుల ఏర్పాటు ఆయన చూసుకుంటారు. అలాగే వివిధ విభాగాల బృందాల మధ్య సమన్వయం సాధించడం, ఆలయ ఆపరేషన్లకు సంబంధించిన పనులను నిర్వహించడం ఆయన బాధ్యతల్లో భాగం. భారత వైమానిక దళంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఈ కొత్త బాధ్యతలను సజావుగా నిర్వర్తించడానికి ఆయనకు ఎంతో ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
జితేంద్ర మిశ్రా భారత వైమానిక దళంలో దాదాపు 40 సంవత్సరాల పాటు విశేష సేవలందించారు. ఆయన 1986 డిసెంబర్ 6న ఫైటర్ పైలట్గా ఎయిర్ ఫోర్స్లో చేరారు. తన సుదీర్ఘ కెరీర్లో ఆయన 18 కంటే ఎక్కువ రకాల విమానాలను నడిపారు. మొత్తం 3,000 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఆయనకు ఉంది. వైమానిక దళంలో ఉన్నప్పుడు ఆయన అనేక కీలకమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో వెస్ట్రన్ కమాండ్కు నాయకత్వం వహించిన ఆయనకు సర్వోత్తమ్ యుద్ధ సేవా పతకం కూడా లభించింది. దాదాపు 39 ఏళ్ల పాటు భారత వైమానిక దళంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు.
తన సుదీర్ఘ సర్వీస్లో జితేంద్ర మిశ్రా పలు కీలక కమాండ్, స్టాఫ్ పదవుల్లో పనిచేశారు. ఫైటర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్గా, ఎయిర్క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ (ASTE)లో చీఫ్ టెస్ట్ పైలట్గా బాధ్యతలు నిర్వహించారు. రెండు ఫ్రంట్లైన్ ఎయిర్ బేస్లకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్గా కూడా పనిచేశారు. అంతేకాకుండా డైరెక్టర్ (ఆపరేషనల్ ప్లానింగ్ అండ్ అసెస్మెంట్ గ్రూప్), ప్రిన్సిపల్ డైరెక్టర్ (ASR), ఎయిర్ హెడ్క్వార్టర్స్లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్ట్స్), ASTE కమాండెంట్ వంటి కీలక బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా కూడా సేవలందించారు. రామ మందిరం CEOగా బాధ్యతలు చేపట్టే ముందు ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (ఆపరేషన్స్)గా పనిచేశారు.

రామ మందిర పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు కొత్త ధర్మకర్తలను నియమించింది. ఢిల్లీకి చెందిన మహేష్ భగచంద్కా, అయోధ్యకు చెందిన మదన్ మోహన్ పాండే, షికోహాబాద్కు చెందిన నిర్మలా యాదవ్లను కొత్త ట్రస్టీలుగా ఎంపిక చేసింది. మహేష్ భగచంద్కా దివంగత విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్కు బంధువుగా సమాచారం. కొత్త ట్రస్టీల నియామకాలతో పాటు జితేంద్ర మిశ్రాను తొలి CEOగా నియమించే అంశంపై కూడా ట్రస్ట్ కీలక సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సైనిక రంగంలో సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్న మిశ్రా నియామకంతో రామ మందిర నిర్వహణ, పరిపాలన, విరాళాల వ్యవహారాల్లో మరింత క్రమబద్ధత తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇక జితేంద్ర మిశ్రా స్వస్థలం ఉత్తర ప్రదేశ్లోని దేవ్రియా జిల్లా, భాట్పాల్ రాణి ప్రాంతంలోని భోపాల్పురా గ్రామం. వైమానిక దళంలో అనేక ఉన్నత పదవుల్లో పనిచేసిన ఆయన, ఇప్పుడు అయోధ్య రామ్ మందిర్ సీఈఓగా ఒక భారీ పరిపాలనా బాధ్యతను చేపట్టారు. ఆయనకున్న నాయకత్వ లక్షణాలు, ఆర్గనైజేషన్ స్కిల్స్ మందిర నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడనున్నాయి.


