ISRO GSLV-F17 Launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV-F17 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్.. 2,367 కిలోల బరువున్న EOS-05 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. GSLV-F17 ద్వారా EOS-05ను కక్ష్యలోకి చేర్చినట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ప్రకటించారు. ఈ ప్రయోగంతో దేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతం కానున్నాయి. EOS-05ను తొలుత 170 x 29,000 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రాకెట్ అంచనాలకు మించి మెరుగైన పనితీరు కనబరచింది. దీంతో ఉపగ్రహాన్ని 171 x 31,026 కిలోమీటర్ల కక్ష్యలోకి విజయవంతంగా చేర్చినట్లు వి. నారాయణన్ తెలిపారు. అక్కడి నుంచి ఉపగ్రహంలోని స్వంత ప్రొపల్షన్ వ్యవస్థ సాయంతో దానిని తుది కక్ష్యలోకి తీసుకెళ్లనున్నారు.
GSLV-F17 మిషన్ 2026లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగంగా నిలిచింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శ్రీహరికోట నుంచి జరిగిన రెండో విజయవంతమైన ప్రయోగం ఇది. అంతకుముందు ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్కు చెందిన ప్రయోగం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కమ్యూనికేషన్ ఉపగ్రహాలతో పాటు గగన్యాన్ కార్యక్రమానికి సంబంధించిన రెండు మానవరహిత మిషన్లు సహా మొత్తం ఆరు ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.
EOS-05 మిషన్కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులోని జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భూమిని పరిశీలించేలా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. దేశ అవసరాల కోసం భూమిని అత్యంత నిశితంగా పరిశీలించడం దీని ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. ముఖ్యంగా భారత ఉపఖండంపై నిరంతర పర్యవేక్షణకు EOS-05 ఉపయోగపడనుంది. EOS-05లో అధునాతన ఇమేజింగ్ సాంకేతికతను ఉపయోగించారు. సాధారణ పరిస్థితుల్లో ప్రతి 30 నిమిషాలకు తాజా చిత్రాలను అందించే సామర్థ్యం దీనికి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యవధి ఐదు నిమిషాలకు తగ్గేలా చిత్రాలను అందించగలదని ఇస్రో వెల్లడించింది. దీంతో వేగంగా మారే పరిస్థితులను పర్యవేక్షించడానికి ఉపగ్రహం ఉపయోగపడనుంది.
తుఫానులు, వరదలు, కార్చిచ్చులు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో EOS-05 నుంచి అందే చిత్రాలు కీలకంగా మారనున్నాయి. ప్రభావిత ప్రాంతాలను గుర్తించడం, నష్టాన్ని అంచనా వేయడం, సహాయక చర్యలకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో ఉపగ్రహ డేటా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాతావరణ మార్పులు, భూ వినియోగంలో మార్పులు, నీటి వనరులు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించడంలోనూ ఈ మిషన్ దోహదం చేయనుంది. భారత సరిహద్దులపై వ్యూహాత్మక పర్యవేక్షణలో EOS-05 కీలక పాత్ర పోషించనుంది. తక్కువ వ్యవధిలో తాజా చిత్రాలను అందించే సామర్థ్యం కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో చోటుచేసుకునే మార్పులను వేగంగా గుర్తించేందుకు ఇది సహాయపడుతుంది. దీంతో భూ పరిశీలనతో పాటు దేశ భద్రత, విపత్తు నిర్వహణ, వాతావరణ పర్యవేక్షణ వంటి విభాగాల్లో EOS-05 సేవలు ఉపయోగపడనున్నాయి.
GSLV-F17 మిషన్ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భారత్ ప్రయోగించిన తొలి ఇమేజింగ్ శాటిలైట్గా EOS-05 నిలిచిందని ప్రధాని ప్రశంసించారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న సాంకేతిక పురోగతి, ఆవిష్కరణలు, సామర్థ్యాలకు నిదర్శనమని అన్నారు. ఇస్రోతో పాటు భారతీయ పరిశ్రమల భాగస్వామ్యం పెరుగుతుండటం దేశ అంతరిక్ష రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ పేర్కొన్నారు.
GSLV-F17 విజయంతో ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కమ్యూనికేషన్ ఉపగ్రహాలతో పాటు గగన్యాన్ కార్యక్రమానికి సంబంధించిన మానవరహిత మిషన్లను చేపట్టేందుకు సంస్థ సిద్ధమవుతోంది. భారత వ్యోమగాములను భవిష్యత్తులో అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో చేపడుతున్న గగన్యాన్ కార్యక్రమంలో ఈ మానవరహిత ప్రయోగాలు కీలకంగా మారనున్నాయి. దీంతో GSLV-F17 విజయం తర్వాత ఇస్రో చేపట్టబోయే తదుపరి మిషన్లపై మరింత ఆసక్తి నెలకొంది.


