BCCI: భారత అండర్-19 జట్టుకు ఎంపికైన బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్(Rohit Yadav)పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. వయసుకు సంబంధించిన వివరాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. రోహిత్ యాదవ్ ఒక్కరే కాకుండా.. బెంగాల్కు చెందిన మరో 61 మంది యువ క్రికెటర్ల వయసు ధ్రువపత్రాల్లోనూ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించినట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) వెల్లడించింది. మొత్తం 62 మంది ఆటగాళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన అనంతరం వారి వయసు వివరాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.
పత్రాలు, వయసు వివరాల్లో తేడాలు గుర్తించిన నేపథ్యంలో 2026-27, 2027-28 సీజన్లలో ఏ టోర్నమెంట్లోనూ నమోదు చేసుకోవడానికి లేదా బదిలీకి ఈ 62 మంది ఆటగాళ్లను అనర్హులుగా క్యాబ్ ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ యాదవ్తో పాటు 2022 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రవికుమార్, స్పిన్ ఆల్రౌండర్ విశాల్ భట్టి కూడా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రవికుమార్ వయసుకు సంబంధించి క్యాబ్ రికార్డుల్లో ఉన్న వివరాలకు, ఇతర అధికారిక రికార్డుల్లోని వివరాలకు సుమారు 45 నెలల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. మరికొందరు ఆటగాళ్ల వయసు వివరాల్లోనూ గణనీయమైన తేడాలు ఉన్నట్లు వెల్లడించింది.
ఈ వ్యవహారంపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే 62 మంది ఆటగాళ్లకు సంబంధించిన వివరాలను బీసీసీఐకి అందజేసినట్లు పేర్కొంది. వయసు ధ్రువపత్రాల్లో తప్పుడు సమాచారం ఉన్నట్లు తేలిన నేపథ్యంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
దీంతో ఈ 62 మంది ఆటగాళ్లపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోహిత్ యాదవ్పై ఇప్పటికే రెండేళ్ల నిషేధం పడటంతో.. మిగిలిన ఆటగాళ్ల విషయంలోనూ ఇదే తరహా చర్యలు ఉంటాయా అనే చర్చ మొదలైంది.
ఉత్తరప్రదేశ్కు చెందిన రోహిత్ యాదవ్ ఇటీవల భారత అండర్-19 జట్టుతో శ్రీలంక పర్యటనలో పాల్గొన్నాడు. ఆ సిరీస్లో ఆరు వికెట్లు తీసిన అతడు.. చివరి టెస్టులో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుకు కూడా ఎంపికయ్యాడు. అయితే రోహిత్ పుట్టిన తేదీకి సంబంధించి గతంలో సమర్పించిన పత్రాల్లో వేర్వేరు వివరాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. 2014లో బెంగాల్ అసోసియేషన్కు ఇచ్చిన వివరాల్లో తన పుట్టిన తేదీని 2007 జూలై 7గా పేర్కొన్నాడు. ఆ సమయంలో తన చిరునామాను ఉత్తరప్రదేశ్గా నమోదు చేశాడు.అనంతరం 2017లో ఆధార్ వివరాలను అప్డేట్ చేసే సమయంలో తాను 2006లో జన్మించినట్లు పేర్కొన్నట్లు సమాచారం. ఆ తర్వాత 2020, 2021లో మరోసారి వివరాలు మార్చగా.. తన పుట్టిన సంవత్సరం 2009గా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇలా వేర్వేరు పత్రాల్లో పుట్టిన తేదీ, వయసుకు సంబంధించి భిన్నమైన వివరాలు ఉండటంతో రోహిత్ యాదవ్పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఇదే వ్యవహారంలో మరో 61 మంది పేర్లు వెలుగులోకి రావడంతో బెంగాల్ క్రికెట్లో వయసు మోసాల అంశం హాట్టాపిక్గా మారింది.


