Pawan Kalyan: రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్స్పై(Andhra Paper Mills) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల చెల్లింపుతో పాటు కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ పరిశ్రమ యాజమాన్యంపై మండిపడ్డారు. ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరినా స్పందించకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంలో నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీ లేదా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు ఆంధ్రా పేపర్స్ నుంచి పన్ను చెల్లింపులు జరగలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు సుమారు రూ.21.34 కోట్ల మేర పన్నులు బకాయి ఉన్నాయని తెలిపారు.
పన్నులు చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పన్నులు చెల్లించాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నగరంలో ఉత్పత్తి అవుతున్న ద్రవ వ్యర్థాల్లో గణనీయమైన భాగం ఆంధ్రా పేపర్స్ నుంచే వస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నగరంలో రోజుకు సుమారు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా.. ఆంధ్రా పేపర్స్ నుంచి సుమారు 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు వస్తున్నాయని తెలిపారు.
పరిశ్రమ వ్యర్థాల నమూనాలను పరీక్షించగా బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) నిర్ణీత ప్రమాణాలకు మించి ఉన్నట్లు గుర్తించామని పవన్ వెల్లడించారు. లగూన్స్ వద్ద సేకరించిన నమూనాల్లో లీటర్ నీటికి 36 మిల్లీగ్రాముల BOD నమోదైందని, ఇది నిర్దేశిత పరిమితి కంటే అధికమని తెలిపారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గతంలో సూచించినా వాటిని పాటించలేదని ఆరోపించారు. పరిశ్రమను వెంటనే మూసివేయడం లేదా ఇతర కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పరిశ్రమలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ముందుగా షోకాజ్ నోటీసులు ఇచ్చి తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పించామని పవన్ తెలిపారు.
గత మూడు నెలలుగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశ్రమ ప్రతినిధులతో పలుమార్లు చర్చించి సమస్య పరిష్కారానికి మార్గాలను సూచించినప్పటికీ.. యాజమాన్యం నుంచి తగిన స్పందన రాలేదని పేర్కొన్నారు. దీంతో ఆంధ్రా పేపర్ మిల్స్కు తక్షణమే సమన్లు జారీ చేసి, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అవసరమైతే పెనాల్టీలు, కార్యకలాపాల నిలిపివేత, సీజ్, లైసెన్స్ రద్దు వంటి చర్యలు కూడా నిబంధనల మేరకు చేపట్టవచ్చని స్పష్టం చేశారు. ఈ కేసులకు సంబంధించిన న్యాయ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున లీగల్ టీమ్ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

