ముప్పై ఏళ్ల కల సాకారం కాబోతోంది. కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. మార్కాపురం జిల్లా గంటవానిపల్లి వేదికగా ప్రాజెక్టు తొలిదశను ఆవిష్కరిస్తారు. ఫీడర్ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని నల్లమలసాగర్ జలాశయంలోకి విడుదల చేస్తారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలకు జలహారతి ఇస్తారు. 30 ఏళ్ల క్రితం 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు నవ్యాంధ్ర సీఎంగా అదే ప్రాజెక్టును జాతికి అంకితం చేయనుండటం విశేషం. వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. తీవ్ర వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు, ఫ్లోరైడ్ సమస్యలు, సాగునీటి కొరతతో దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతానికి వెలిగొండ కేవలం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు… ఆ ప్రాంత భవిష్యత్తును మార్చే జీవనాధార ప్రాజెక్టు. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించి నల్లమలసాగర్లో నిల్వ చేసి, ప్రధాన కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. 53 టీఎంసీల సామర్థ్యం గల వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలలోని 30 మండలాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో సహా సుమారు 23 లక్షల మందికి తాగునీటి ప్రయోజనం చేకూరనుంది. ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్కు విడుదల చేయనున్నారు. తొలి విడతలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండో దశ పూర్తయితే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. వెలిగొండ ప్రాజెక్టుతో కరువు ప్రాంతంలో వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.


