ఆంధ్రప్రదేశ్ : డీఎస్సీ నియామకాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చకు తాను సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ మరోసారి సవాల్ విసిరారు. జగన్కు ఇది తన ఐదో సవాల్ అని పేర్కొన్న ఆయన.. దమ్ముంటే చర్చకు రావాలని అన్నారు. “టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం… తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోవడం కాదు.. బయటకు రా” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని లోకేశ్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా 16 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. కష్టపడి టెట్, డీఎస్సీ పరీక్షలు రాసి ఎంపికైన ఉపాధ్యాయులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీకి మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారని లోకేశ్ ఎద్దేవా చేశారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లపై కూడా అవగాహన లేకుండా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీలో ఇప్పటికే తమ ప్రభుత్వం అన్ని అంశాలపై సమాధానం ఇచ్చిందని.. అయినప్పటికీ బయటకు వచ్చి మళ్లీ అవే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జగన్ చెప్పే ఆరోపణలను టీడీపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక అని లోకేశ్ అన్నారు. వారి త్యాగాల పునాదులపైనే పార్టీ నిర్మితమైందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులను న్యాయబద్ధంగా తొలగిస్తామని చెప్పారు. ఇప్పటికే 75 శాతం కేసులు పరిష్కరించామని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న నీరు-చెట్టు బిల్లుల సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని అందించారని లోకేశ్ గుర్తుచేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, రైల్వే జోన్ ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థలను ఉత్తరాంధ్రకు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ కార్యకర్తలు సిద్ధం కావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు కూటమి ప్రభుత్వాలు ఉంటేనే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అన్నారు. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించాలని కోరారు.


