Konda Surekha: మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి కోల్పోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదని ఆమె స్పష్టం చేశారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించే ముందు కనీసం తన వాదన వినాల్సిన అవసరం ఉందని కొండా సురేఖ పేర్కొన్నారు. తాను నిజంగా తప్పు చేసి ఉంటే చర్య తీసుకున్నా బాధపడేదాన్ని కాదని, కానీ తన వివరణ తీసుకోకుండానే నిర్ణయం తీసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా చివరిసారిగా తన మాట చెప్పుకునే అవకాశం ఇస్తారని, కానీ తనకు మాత్రం అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె వాపోయారు.
మంత్రివర్గం నుంచి తనను తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్కు సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి తాను రాసిన లేఖలను మీడియా ముందు విడుదల చేశారు. ఒకవేళ తనను రాజీనామా చేయాలని అడిగి ఉంటే తానే స్వయంగా మంత్రి పదవికి రాజీనామా చేసేదాన్నని తెలిపారు. తన వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తనను బర్తరఫ్ చేయకపోతే పార్టీ నుంచి వెళ్లిపోతానని అధిష్టానాన్ని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ ఆరోపించారు.
తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడాన్ని కూడా కొండా సురేఖ ప్రశ్నించారు. తన కుమార్తె స్వతంత్ర మహిళ అని, ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని తెలిపారు. కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన కొండా సురేఖ.. వారిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుందని ఏఐసీసీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. తనపై మాత్రం కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని భావిస్తున్నానని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలన, నాయకులతో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై కూడా కొండా సురేఖ విమర్శలు చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో నాయకులు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా కమ్యూనికేషన్ ఉండేదని గుర్తుచేశారు. ప్రజలతో, పార్టీ నాయకులతో వైఎస్సార్కు ఉన్నంతగా రేవంత్ రెడ్డికి కమ్యూనికేషన్ లేదని ఆమె వ్యాఖ్యానించారు. నాయకులతో సీఎం మరింతగా మమేకం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత తాను రేవంత్ రెడ్డినే ఎక్కువగా అభిమానించానని కొండా సురేఖ తెలిపారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని, ముఖ్యమంత్రి కావాలని తానే ముందుగా కోరుకున్నానని గుర్తుచేశారు. ఈ విషయాలను సీఎం కూడా గుర్తుంచుకోవాలని అన్నారు.
తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వివక్ష చూపించారని కొండా సురేఖ ఆరోపించారు. తన శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో మంత్రి కడియం శ్రీహరి జోక్యం చేసుకున్నారని, తన శాఖ అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహించారని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడంలో వెనుకడుగు వేయబోనని ఆమె స్పష్టం చేశారు. మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదని తెలిపారు. ఇకపై సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతూ తన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు.
తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కడం సంతోషంగా ఉందని కొండా సురేఖ అన్నారు. అయితే తన కోసం డాక్టర్ జి. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. మొత్తంగా మంత్రి పదవి కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడే ఉద్దేశం లేదని, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ కొనసాగిస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు.


