Raja Singh: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వ్యవహారం హాట్టాపిక్గా మారింది. ఈ అంశంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కేవలం నిధులు, డబ్బుల వాటాల పంపిణీలో తేడాలు రావడం వల్లే కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజాసింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే అవినీతికి మారుపేరు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న విషయాలు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నాయని రాజాసింగ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో అనేక అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మంత్రి పదవి నుంచి సురేఖను తొలగించే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో అసమ్మతి గళం వినిపిస్తున్న మంత్రి కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సాయంత్రంలోపు రాజీనామా చేయకపోతే ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు బర్తరఫ్ లేఖను పంపనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు.
మరోవైపు భవిష్యత్ కార్యాచరణపై మంత్రి కొండా సురేఖ దంపతులు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అధిష్ఠానం నిర్ణయం కంటే ముందే రాజీనామా ప్రకటించే ఆలోచనలో కొండా సురేఖ ఉన్నట్లు తెలిసింది . పార్టీలో ఉండాలా లేదా అనే అంశంపై తన అనుచరులతో చర్చించాక నిర్ణయం ప్రకటించనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న సురేఖ కుటుంబం తాజా పరిణామాలపై ఎలాంటి బాంబ్ పేల్చనున్నారనే ఆసక్తి నెలకొంది.


