Smriti Mandhana Records: టీమిండియా మహిళల స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ఆసియా కప్ 2026లో హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర శతకంతో చెలరేగిన మంధాన.. ఒకే ఇన్నింగ్స్లో రెండు అరుదైన ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అత్యధిక అంతర్జాతీయ పరుగులు, అత్యధిక సెంచరీలు సాధించిన మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో మంధాన కేవలం 64 బంతుల్లోనే 14 ఫోర్లు, 7 సిక్స్లతో 124 పరుగులు చేసింది. ఈ అద్భుత ఇన్నింగ్స్తో అంతర్జాతీయ క్రికెట్లో ఆమె పరుగుల సంఖ్య 10,880కి చేరింది. దీంతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును అధిగమించింది.
మిథాలీ రాజ్ను అధిగమించిన స్మృతి
మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఇప్పటివరకు మిథాలీ రాజ్ 10,868 పరుగులతో అగ్రస్థానంలో ఉండేది. హాంకాంగ్పై 124 పరుగులతో మంధాన ఈ రికార్డును బద్దలు కొట్టింది.స్మృతి మంధాన కేవలం 303 ఇన్నింగ్స్ల్లో 10,880 పరుగులు సాధించగా.. మిథాలీ రాజ్ 333 ఇన్నింగ్స్ల్లో 10,868 పరుగులు చేసింది. దీంతో తక్కువ ఇన్నింగ్స్ల్లోనే మంధాన ఈ ఘనత సాధించడం మరో విశేషం.
మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు
స్మృతి మంధాన – 10,880 పరుగులు
మిథాలీ రాజ్ – 10,868 పరుగులు
సుజీ బేట్స్ – 10,740 పరుగులు
షార్లెట్ ఎడ్వర్డ్స్ – 10,273 పరుగులు
స్టాఫనీ టేలర్ – 10,007 పరుగులు
సెంచరీల్లోనూ నంబర్ వన్
పరుగుల రికార్డుతో పాటు స్మృతి మరో ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుంది. హాంకాంగ్పై సాధించిన శతకం ఆమె అంతర్జాతీయ కెరీర్లో 18వ సెంచరీ. దీంతో ఇప్పటివరకు 17 సెంచరీలతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్, దక్షిణాఫ్రికా స్టార్ లారా వోల్వార్డ్ట్ను మంధాన అధిగమించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్గా ఒంటరిగా అగ్రస్థానంలో నిలిచింది.
మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు
స్మృతి మంధాన – 18
మెగ్ లానింగ్ – 17
లారా వోల్వార్డ్ట్ – 17
హేలీ మాథ్యూస్ – 15
సుజీ బేట్స్ – 14
టీ20ల్లోనూ అరుదైన ఘనత
హాంకాంగ్పై చేసిన సెంచరీతో స్మృతి మంధాన మరో ప్రత్యేక రికార్డును నమోదు చేసింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో రెండు సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా నిలిచింది. మంధాన తన తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీని 2025లో ఇంగ్లండ్పై సాధించింది. ఆ మ్యాచ్లో 112 పరుగులు చేసిన ఆమె.. తాజాగా హాంకాంగ్పై 124 పరుగులతో రెండో శతకాన్ని నమోదు చేసింది. దీంతో భారత మహిళల క్రికెట్లో ఈ ఫార్మాట్లో రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్గా నిలిచింది. 124 పరుగుల ఈ ఇన్నింగ్స్తో మంధాన మహిళల టీ20 ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును కూడా తన పేరిట రాసుకుంది. ఇప్పటివరకు శ్రీలంక స్టార్ చమరీ అటపట్టు 2024లో మలేషియాపై చేసిన 119 పరుగులు* ఈ రికార్డుగా ఉండేవి. తాజాగా 124 పరుగులతో మంధాన ఆ మార్కును అధిగమించింది.
హాంకాంగ్పై మంధాన 124 పరుగుల ఇన్నింగ్స్ కేవలం సెంచరీగానే మిగలలేదు. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు, అత్యధిక సెంచరీల రికార్డు, టీ20ల్లో రెండు సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ ఘనత, ఆసియా కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ వంటి పలు రికార్డులను ఒకేసారి అందుకుంది. 30 ఏళ్ల స్మృతి మంధానకు ఈ ఇన్నింగ్స్ ఆమె అంతర్జాతీయ కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైన ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. మంధాన రికార్డు సెంచరీతో భారత్ హాంకాంగ్పై భారీ విజయాన్ని నమోదు చేసి ఆసియా కప్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది.


