New Zilla Parishads: ఆంధ్రప్రదేశ్లో పాలనా వికేంద్రీకరణకు అనుగుణంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా ప్రజా పరిషత్లను పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జెడ్పీల స్థానంలో కొత్తగా 28 జిల్లా ప్రజా పరిషత్లను ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2025 నవంబర్లో ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలకు 28 జెడ్పీలు ఉండనున్నాయి. రాష్ట్రంలోని 660 మండల ప్రజా పరిషత్లను సంబంధిత జిల్లాల పరిధిలోని జెడ్పీల కిందకు తీసుకురానున్నారు.
ప్రస్తుత 13 జెడ్పీల పాలకవర్గాల పదవీకాలం సెప్టెంబర్ 24తో ముగియనుంది. ఆ తర్వాత కొత్త 28 జెడ్పీల ఏర్పాటు అమల్లోకి రానుంది. ప్రతి జెడ్పీకి పరిపాలనా అధికారి ఉండేలా ప్రభుత్వం 30 కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 15 సీఈవో, 15 డిప్యూటీ సీఈవో పోస్టులు ఉన్నాయి. సీఈవోలకు రూ.80,910–రూ.1,66,680, డిప్యూటీ సీఈవోలకు రూ.65,360–రూ.1,54,980 వేతన స్కేల్ను ఖరారు చేశారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని పని భారం, మండలాల సంఖ్య ఆధారంగా కొత్త జెడ్పీలకు సర్దుబాటు చేయనున్నారు. భవిష్యత్తులో మండలాల పునర్వ్యవస్థీకరణ జరిగితే, దానికి అనుగుణంగా జెడ్పీ పరిధుల్లో మార్పులు చేసుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది.
ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఏ క్షణంలోనైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. అనంతరం పంచాయతీ, ఎంపీటీడీసీ, జెడ్పిటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. కొత్త నిర్ణయాలకు అనుగుణంగా కూటమి పార్టీలతో పాటు వైసీపీ స్థానిక పోరుకు సిద్ధమవుతున్నాయి.


