దాదాపు 18 ఏళ్లుగా సాగుతున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలతో 2008లో నమోదైన కేసులో మార్గదర్శికి మరోసారి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు కేసును కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేసును పరిశీలిస్తే ఇది వ్యక్తిగత వివాదానికి సంబంధించిన వ్యవహారంలా కనిపిస్తోందని జస్టిస్ సుందరేష్ వ్యాఖ్యానించారు. పిటిషనర్ తరఫున వాదనలు కొనసాగుతున్న కొద్దీ తమకు మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. 2008 జనవరి 23న అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్షియర్స్తో పాటు హెచ్యూఎఫ్ కర్త రామోజీరావుపై కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని మార్గదర్శి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా.. 2018 డిసెంబరు 31న హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది.
డిపాజిటర్లు ఎవరూ తమ సొమ్ము తిరిగి రాలేదని ఫిర్యాదు చేయలేదని, డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లించేందుకు సంస్థ చర్యలు తీసుకుందని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పును ఉండవల్లి అరుణ్కుమార్, అప్పటి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. 2024 ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు కేసును తెలంగాణ హైకోర్టుకు తిరిగి పంపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు డిపాజిటర్లకు మరో అవకాశం కల్పించింది. మార్గదర్శిలో డిపాజిట్లు చేసి సొమ్ము అందని వారు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చంటూ బహిరంగ ప్రకటన ఇచ్చింది. అయితే ఒక్క డిపాజిటర్ కూడా తమ సొమ్ము అందలేదంటూ కోర్టును ఆశ్రయించలేదు. మరోవైపు.. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. డిపాజిటర్లకు వడ్డీతో కలిపి రూ.2,500 కోట్లకు పైగా చెల్లించినట్లు కోర్టుకు తెలిపారు. డబ్బు తీసుకోని డిపాజిటర్ల కోసం ఎస్క్రో ఖాతాలో రూ.5.23 కోట్లు ఉన్నాయని వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు బహిరంగ ప్రకటన ఇచ్చినా.. ఒక్క డిపాజిటర్ కూడా తమ సొమ్ము అందలేదని ఫిర్యాదు చేయలేదు.
2018లో తొలిసారి హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టివేయగా.. 2024లో సుప్రీంకోర్టు కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపింది. అనంతరం 2025 ఆగస్టు 4న హైకోర్టు క్రిమినల్ ప్రాసిక్యూషన్ను రద్దు చేసింది. ఆ తీర్పును ఉండవల్లి సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అయితే.. ‘ఈ కేసును పరిశీలిస్తే వ్యక్తిగత వివాదం తప్ప మరొకటి కనిపించడం లేదు’ అని జస్టిస్ సుందరేష్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘మీరు ఎంత ఎక్కువగా వాదిస్తే మాకు మీపై అంత ఎక్కువ అనుమానాలు వస్తాయి’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ తీర్పును ఉండవల్లి అరుణ్కుమార్ 2025 డిసెంబరు 19న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తాజాగా ఆ ఎస్ఎల్పీని కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో.. మార్గదర్శి ఫైనాన్షియర్స్కు ఈ కేసులో మరో కీలక న్యాయ విజయం లభించింది. 2008లో మొదలైన కేసు.. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సాగిన న్యాయపోరాటం.. డిపాజిటర్ల క్లెయిమ్లపై కోర్టు పరిశీలన.. చివరకు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ కొట్టివేత.. ఇలా దాదాపు 18 ఏళ్లుగా సాగిన మార్గదర్శి కేసులో తాజా తీర్పు కీలక మలుపుగా నిలిచింది.

