అనకాపల్లి: అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలు మాత్రమే కాదని.. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ప్రాంతాల నిర్మాణం కూడా అభివృద్ధిలో భాగమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో పర్యటించిన ఆయన ప్రజావేదికలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ‘మన ఊరు–మన బాధ్యత’ అనే సంకల్పంతో స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవనానికి పరిశుభ్రత ఎంతో అవసరమని పేర్కొన్న ఆయన.. స్వచ్ఛత కోసం ముందుకొస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్ పంచాయతీగా తీర్చిదిద్దాలని అధికారులకు, ప్రజలకు సూచించారు.
అనకాపల్లి, విశాఖ జిల్లాలకు సెప్టెంబరు తొలివారంలోనే గోదావరి జలాలను తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలోని ప్రతి చెరువు, రిజర్వాయర్ను నింపే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. విశాఖకు మించి అనకాపల్లికి పెట్టుబడులు వస్తున్నాయని సీఎం తెలిపారు. జిల్లాలో స్టీల్ సిటీ నిర్మాణం జరగబోతోందని, డేటా సెంటర్లు కూడా రాబోతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో అనకాపల్లి నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. డేటా సెంటర్ ద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు, ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోతుంటే.. కొంతమంది మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్ ఇంకా ప్రారంభం కాకముందే నీటి కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో గ్రామాలు చెత్తమయంగా మారాయని సీఎం విమర్శించారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛరథాలను పంపిస్తున్నామని చెప్పారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఖర్చు లేకుండా చేసుకునే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. స్వచ్ఛత, పచ్చదనం, పునరుత్పాదక ఇంధనం ద్వారా గ్రామాల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ అగ్రదేశంగా వికసిత్ భారత్గా అవతరిస్తుందని చంద్రబాబు అన్నారు. అప్పటికి దేశంలో తలసరి ఆదాయం రూ.50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో పాటు స్వచ్ఛతకు సమాన ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు.


