CM Revanth Reddy: పిల్లల ఎదుగుదలకు, వారి భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొడంగల్లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరుగుతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేశంలో రాణిస్తున్న వివిధ రంగాల ప్రముఖులు ప్రభుత్వ బడుల్లో చదువుకున్న వారేనని పేర్కొన్నారు. తాను కూడా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే తెలంగాణ సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ సందర్భంగా 123 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.
ఇక విద్యారంగంలో తెలంగాణ 2023లో 28వ స్థానంలో ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 17వ స్థానానికి చేరిందని, ఈ పురోగతికి ఉపాధ్యాయులే ప్రధాన కారణమని అన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 95 శాతం సీట్లు భర్తీ కావడం సంతోషకరమని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టిన 55 రోజుల్లోనే 10 వేల మంది కొత్త ఉపాధ్యాయులను నియమించామని, పదోన్నతులు, బదిలీల సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కోరుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు.
విద్యా వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని, పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలతో పాటు పరిశ్రమల అనుసంధానం కల్పిస్తున్నామని తెలిపారు.గడచిన 1000 రోజుల పాలనలో తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని.. మరొకరు మాత్రం వెయ్యి రోజుల్లో ఒక్కరోజు కూడా బయటకు రాలేదని కేసీఆర్పై పరోక్ష విమర్శలు చేశారు.


