Polavaram Left Canal: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు తొలిసారిగా ఉత్తరాంధ్ర నేలను తాకాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి నేలపై సాష్టాంగ నమస్కారం చేశారు. అంతకుముందు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, నారాయణ, కొలుసు పార్థసారథి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు. పాయకరావుపేటకు చేరుకున్న సీఎం చంద్రబాబు ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ పోలవరం ఎడమ కాలువ వద్దకు చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, రైతులు ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
ఎన్నో అడ్డంకులు దాటుకుని ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం వెనక ఇంజనీరింగ్ నిపుణుల కృషి ఎంతో ఉంది. తూర్పు కనుమలను తొలిచి, ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి నదులను దాటుకుంటూ పోలవరం ఎడమ ప్రధాన కాలువను నిర్మించారు. కొన్ని ప్రాంతాల్లో నదుల ప్రవాహానికి ఎగువన అక్విడెక్టులు నిర్మించగా.. ఏలేరు నది గర్భం కింద నుంచి సైఫన్ ద్వారా నీటిని తరలించేలా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంతో అనుసంధానం చేయడంతో గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకున్నాయి.
గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరడంతో ఈ ప్రాంత వ్యవసాయానికి భారీ ప్రయోజనం కలగనుంది. ప్రాజెక్టు తొలి దశలో అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదే సమయంలో సుమారు 5.23 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరాంధ్రలో సాగునీటి కొరతను తగ్గించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకడంతో ఈ ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. సాగునీరు అందుబాటులోకి రావడంతో వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న గోదావరి జలాల రాక ఇప్పుడు సాకారమైంది. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనుసంధానంతో గోదావరి నీరు ఈ ప్రాంతానికి చేరుకోవడం రాష్ట్ర సాగునీటి చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది.గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకిన ఈరోజు చరిత్రలో నిలిచిపోనుంది.


